
గృహ నిర్మాణం - Housing
రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి ఇల్లు లేదనే దీన స్థితి వుండరాదని ప్రతి ఒక్కరికి అందమైన నీడ కల్పించాలని జగన్ సర్కార్ సమున్నత ఆశయం పెట్టుకుంది. ఇందులో భాగంగానే 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేసి వచ్చే మూడేళ్లలో ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ మహోన్నత యజ్ఞం పూర్తి చేయటం కోసం రూ. 50 వేల కోట్లతో పకడ్బందీ కార్యచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం అయిదేళ్ళ కాలంలో పట్టుమని 4 లక్షలు ఇళ్లు కూడ నిర్మించిన దాఖలాలు లేవు. అయితే జగన్ సర్కార్ ఈ రెండేళ్ళ స్వల్ప వ్యవధిలోనే 30 లక్షల మందికి నివాస స్థల పట్టాలు పంపిణీ చేసింది. మొదటి దశలో రూ.24 వేల కోట్ల అంచనా వ్యయంతో 15.60 లక్షల ఇల్లు నిర్మించాలని ప్రణాళిక రూపొందించి ఇప్పటికే లక్షలాది ఇళ్ళకి భూమి పూజలు పూర్తి చేసింది. చాల చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం రెండో దశలో చేపట్టేలా కార్యాచరణ సిధ్దమైంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద స్థాయిలో పట్టాలు పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన దాఖలాలు లేవు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశం
ఏక కాలంలో 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలను సకల సౌకర్యాలతో రూపొందించి ఇళ్ల నిర్మాణానికి జగన్ సర్కార్ అంకురార్పణ చేయటం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇన్ని కాలనీలు అతి స్వల్ప కాలంలో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయగలిగింది. పేద ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుందా.. అని ఇతర రాష్ట్రాలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నాయి. కేవలం కాలనీలు ఏర్పాటు చేయటమే కాకుండా వీటిలో అన్ని చోట్ల విద్యుత్, తాగునీరు, మురుగు కాలువలు లాంటి సౌకర్యాలన్ని కల్పించటంతో పాటు పెద్ద కాలనీల్లో ఆసుపత్రులు,విద్యాసంస్థలు కూడా ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక సిధ్దమైంది. ఇది చాల గొప్ప విషయమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా స్వయంగా ప్రశంసించటమే కాకుండా తాను స్వయంగా వచ్చి పరిశీలించి సర్కార్ చర్యలను అభినందింస్తానని కూడ ప్రకటించటం గమనార్హం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఇళ్ల నిర్మాణ బృహత్ కార్యక్రమ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని జాయింట్ కలెక్టర్ గా నియమించింది. ఈ నిర్ణయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. పేదల పట్ల ఈ ప్రభుత్వానికి వున్న ప్రత్యేక శ్రధ్దకు ఈ గృహనిర్మాణ కార్యక్రమం ప్రత్యక్ష నిదర్శనం.