శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటించింది. అలాగే తిరుమలకు ఎలక్ట్రికల్ బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చాలా గుడ్ న్యూస్ లు చెప్పింది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD BOARD)సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పాలమండలిలో చర్చించిన అంశాలు.. తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత వివరించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. తిరుమలను గ్రీన్ జోన్ గా ప్రకటించిన ఆయన.. ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని తెలిపారు.

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అలాగే తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగించనున్నట్టు స్పష్టం చేశారు.

కరోనా పరిస్థితుల నేపథ్యం.. ప్రజారోగ్యం అన్నింటినీ ఆలోచించిత్వరలోనే చిన్నపిల్లల ఆస్పత్రికి శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది అన్నారు. అలాగే ఏపీలో 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.

ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో 500 ఆలయాలను ఏడాదిలోగా నిర్మించాలని పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలను నిర్మిస్తున్నామన్న ఆయన.. జమ్మూలో 62 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నామని, 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.. త్వరలోనే ముంబై, వారణాసిలో కూడా టీటీడీ ఆలయాల నిర్మాణం చేపడతామన్నారు.

గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం చేయిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతోనే నైవేధ్యం సమర్పిస్తున్నామని చెప్పారు.

గత రెండు నెలల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. హనుమంతుడి జన్మస్థలం తిరుమలగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆకాశగంగ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్ను బ్యాన్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సుబ్బారెడ్డి గుర్తు చేశారు.
Source: https://telugu.news18.com/photogallery/andhra-pradesh/tirumala-is-green-zone-ttd-chriman-yv-subbareddy-announced-take-key-decisions-in-board-meeting-ngs-tpt-920550-page-5.html