ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీకి అంతరాయం లేని బ్యాండ్ విడ్త్తో ఇంటర్నెట్ను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి ఇంటర్ నెట్, డిజిటల్ లైబ్రరీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ నాలుగు జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్లో భాగంగా గ్రామాల నుంచే పనిచేసే పరిస్థితి రావాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ లైబ్రరీల నిర్మాణాల ప్రగతిపై సీఎం జగన్కు అధికారులు వివరాలు అందించారు. రాష్ట్రంలో 12,979 పంచాయతీల్లో వైఎస్ఆర్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు నిర్మాణం చేపడుతున్నామని, మూడు దశల్లో విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నామని అధికారులు పేర్కొన్నారు. తొలి విడతలో చేపడుతున్న 4530 విలేజ్ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ పనుల ప్రగతిపై సీఎంకు వివరించారు.
పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉపయోగపడాలని, విలేజ్ డిజిటల్ లైబ్రరీలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. వీటి నిర్వాహణపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనవరి నాటికి తొలిదశలో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి చేస్తామని అధికారులు తెలియజేయగా.. అదే సమయంలో కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై కూడా దృష్టి సారించాలని సీఎం అన్నారు. ప్రతి డిజిటల్ లైబ్రరీలో డెస్క్టాప్ కంప్యూటర్లు, సిస్టం ఛైర్లు, ప్లాస్టిక్ ఛైర్లు, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, ఐరన్ రాక్స్, పుస్తకాలు, మేగజైన్ల ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు.
ఉగాది నాటికి ఫేజ్1లో కంప్యూటర్ పరికరాలతో సహా అందుబాటులోకి మొదటి దశ డిజిటల్ లైబ్రరీలు డిసెంబరు 2022 నాటికి ఫేజ్2 పూర్తి చేసేలా కార్యాచరణ చేయాలన్నారు. జూన్ 2023 నాటికి మూడో దశ డిజిటల్ లైబ్రరీల నిర్మాణ లక్ష్యంగా నిరేశించుకోవాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో అన్ఇంటరెప్టడ్ బ్యాండ్విడ్త్తో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఎం మధుసూధన్ రెడ్డి, ఏపీటీఎస్ ఎండీ ఎం నందకిషోర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Source: https://www.sakshi.com/telugu-news/andhra-pradesh/cm-ys-jagan-review-meeting-set-internet-digital-libraries-village-1407834