ఆరోగ్య రంగంలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీపై సమీక్షలో సీఎం జగన్
మండలానికి 2 పీహెచ్సీలు
ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు డాక్టర్లు
ప్రతి డాక్టర్కు కొన్ని గ్రామాలు
అప్పుడే అందరికీ అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ
తదుపరి సమావేశం నాటికి కార్యాచరణ రూపొందించాలి
ఆరోగ్య రంగంలో ‘నాడు–నేడు’కు రూ.16,270 కోట్ల వ్యయం
యుద్ధ ప్రాతిపదికన మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం
వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నిర్మాణం మార్చి 31కి పూర్తి కావాలి
వైద్యుడు ఆయా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆరోగ్య మిత్ర, ఆశా వర్కర్లు వెంట వెళతారు. డాక్టర్ సేవలు అందించడానికి విలేజ్ క్లినిక్ వేదికగా ఉంటుంది. అవసరమైతే హోం విజిట్స్ కూడా చేయాలి. పల్లెల్లో సగటున 1,500 – 2,000 కుటుంబాలకు ఒక డాక్టర్ ఉంటాడు కనుక కొంత కాలానికి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులపై అతనికి పూర్తి అవగాహన ఏర్పడుతుంది. దీంతో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తుంది. వైద్యం చేయడం సులభమవుతుంది. ఇందుకోసం అవసరమైతే 104 సర్వీసులు పెంచుకోవాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి
పల్లెల్లోకి డాక్టర్లను పంపించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమాల స్థితిగతులు, వనరుల సమీకరణ, పనులు జరుగుతున్న తీరు, ఆరోగ్య శ్రీ అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మండలంలో కనీసం 2 పీహెచ్సీలు ఉండాలని, ప్రతి పీహెచ్సీలో కనీసం ఇద్దరు చొప్పున.. మొత్తం నలుగురు డాక్టర్లు ఉండాలని, ప్రతి డాక్టర్కు కొన్ని గ్రామాలను కేటాయించాలని చెప్పారు. ఆ డాక్డర్ ప్రతి నెల కనీసం రెండు సార్లు తనకు నిర్దేశించిన గ్రామాలకు వెళ్లి వైద్యం అందించాలని, తద్వారా గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితుల మీద అతనికి అవగాహన ఏర్పడుతుందన్నారు.
ఈ మేరకు తదుపరి సమావేశం నాటికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ కొత్త వ్యవస్థను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే దానిపై తేదీలను కూడా ఖరారు చేయాలని చెప్పారు. ఈ కొత్త వ్యవస్థ కోసం ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. తద్వారా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్డుల్లో నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని, మెరుగైన వైద్యం కోసం వారు సరైన ఆస్పత్రికి రిఫరెల్ చేయగలుగుతారన్నారు. ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్, అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి